హత్య కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుల అరెస్టు

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

మిర్యాలగూడ టౌన్‌ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్యతో పాటు ఆమె ప్రియుడిని వాడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌ వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి విలేకరులకు వెల్లడించారు. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్‌ గోవింద్‌(53) అలియాస్‌ గోన్యా, సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికి వివాహాలయ్యాయి. గోవింద్‌ వ్యవసాయం చేస్తుండగా.. సరోజ గొర్రెలు మేపుతూ జీవనం సాగించేవారు. కుమార్తెల వివాహాల సమయంలో సరోజకు అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను కొంతమేర ఆర్థికసాయం చేశాడు. దీంతో శ్రీను అప్పుడప్పుడు సరోజ ఇంటి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శ్రీనుతో సరోజ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే విషయమై గోవింద్‌ తన భార్య సరోజను అనుమానిస్తూ తరచూ గొడవ పడుతుండేవాడు. 10 రోజుల క్రితం శ్రీనుతో సరోజ ఫోన్‌ మాట్లాడుతుండగా గోవింద్‌ గమనించి ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను పగులగొట్టాడు. దీంతో ఎలాగైనా గోవింద్‌ అడ్డు తొలగించుకోవాలని సరోజ, శ్రీను పథకం వేశారు.

నిద్రలో ఉండగానే..

ఈ నెల 10న రాత్రి గోవింద్‌ ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా.. శ్రీను వచ్చాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం శ్రీను గోవింద్‌ ముఖంపై దిండుతో అదిమి పట్టగా.. భర్త కదలకుండా సరోజ కాళ్లు పట్టుకుంది. అయినా గోవింద్‌ ప్రతిఘటించడంతో సరోజ ఇంట్లో ఉన్న రోకలిబండను తీసుకొచ్చి భర్త వృషణాలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం వారిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. మరుసటిరోజు ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి ఇంట్లో గోవింద్‌ చనిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి అన్న ఇస్లావత్‌ దుద్యా ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం దామరచర్ల గ్రామ శివారులోని రైల్వే గేటు సమీపంలో సరోజ, శ్రీను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను మిర్యాలగూడ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అరుణ్‌తేజ్‌ వద్ద హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాాంత్‌రెడ్డి, ఏఎస్‌ఐ జోజి, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించారు.

ఫ రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement