ఏసీబీకి చిక్కిన సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

భానుపురి (సూర్యాపేట) : బోరు బండి యాజమాని నుంచి లంచం డిమాండ్‌ చేసిన సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారితో పాటు లంచం తీసుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరునెలల క్రితం బోరు బండి కొనుగోలు చేసి జిల్లా భూగర్భ జల అధికారి నుంచి అనుమతి తీసుకోవాలనే విషయం తెలియక తన గ్రామంలో ఓ రైతు పొలంలో బోరు వేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన భూగర్భ జల కార్యాలయ సిబ్బంది వెళ్లి అనుమతి లేకుండా బోరు వేయొద్దని చెప్పారు. సదరు బోరుబండి యాజమాని సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి బాలును సంప్రదించగా.. అనుమతి కోసం రూ.లక్ష చెల్లించడంతో పాటు కార్యాలయ ఆవరణలో ఫ్రీగా బోరు వేయాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఈ నెల 10న బోరుబండి యాజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు బుధవారం ఫిర్యాదుదారుడు భూగర్భ జల అధికారి కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వెంకటేశ్వర్లు బోరు బండి యజమాని నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను విచారించగా.. భూగర్భ జల అధికారి బాలు చెప్పడంతోనే లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్‌ చేయనున్నట్లు నల్లగొండ రేంజ్‌ ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు లేదా వాట్సాప్‌ నంబర్‌ 94404 46106కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు సూచించారు.

ఫ ఆయన చెప్పడంతోనే బోరు బండి యజమాని నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌

ఫ ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement