సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏఈలు, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి మండలంలో పనులపై నిరంతరం పర్యవేక్షణ చేసి లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించాలని సూచించారు. కొండమడుగు, జిబ్లక్పల్లి, సిగన్నగూడెం ప్రాంతాల్లోని 2బీహెచ్కే కాలనీల భవనాలు, మౌలిక సదుపాయాల పనులపై ఆరా తీశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పీడీ (హౌసింగ్), ఎంపీడీఓలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (హౌసింగ్), అసిస్టెంట్ ఇంజినీర్లు (హౌసింగ్), పంచాయతీరాజ్ శాఖ అధికారులు , మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ ఐదు నెలల వేతనం విరాళం
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లి సర్పంచ్ ఆర్ల కావ్య వెంకటేశ్యాదవ్ తన ఐదు నెలల వేతనం డబ్బులు రూ.32,500లను గ్రామాభివృద్ధికి బుధవారం అందజేశారు. ఈ డబ్బులను వాటర్ఫిల్టర్ నిర్వాహకులకు వేతనాల కింద చెల్లించారు. సర్పంచ్ వాటర్ఫిల్టర్ ద్వారా గ్రామ ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించడంతో పాటు ఫిల్టర్ కరెంట్ బిల్లులను సొంతంగా చెల్లిస్తున్నారు. దాంతో సర్పంచ్ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆర్ల లింగస్వామి, పంచాయతీ కార్యదర్శి శుభాష్, మాజీ ఎంపీటీసీ సుర్కంటి జంగారెడ్డి, నాయకులు వల్లమల్ల సత్యనారాయణ, సిర్పంగి గణేశ్, మీసాల నర్సింహ, తంగడపల్లి వసంత, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచండి
సంస్థాన్ నారాయణపురం: గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనుల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈఓ ఎన్. శోభారాణి అధికారులను ఆదేశించారు. సంస్థాన్నారాయణపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయవద్దన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
భువనగిరి కేజీబీవీలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని కేజీబీవీలో పీజీసీఆర్టీ(గణితం) సబ్జెక్టు ఖాళీ పోస్టు భర్తీకి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధికారిణి రాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ(గణితం), బీఈడీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ వరకు అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 801 9166587ను సంప్రదించాలని సూచించారు.
22న వేలం పాటలు
మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట నిర్మించిన పది కమర్షియల్ షాపులను ఏడాది కాలానికి అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ఈ నెల 22న బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు మార్కెట్ కార్యదర్శి శివకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం ప్రక్రియలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. టెండర్ షెడ్యూల్ ఫారాలు మార్కెట్ కమిటీ కార్యాలయంలో రూ. 500 చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. టెండర్ ఫారంతో పాటు రూ. 10,000 డీడీని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పేరిట సమర్పించాలని సూచించారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. పది షాపుల్లో జనరల్ కేటగిరీకి నాలుగు, బీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1 చొప్పున కేటాయించనున్నట్లు వివరించారు.


