కట్టంగూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామంలో రైతులతో కలిసి పంట పొలాలను, విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా రికార్డులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, సాగునీరు, ఎరువులు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. తీవ్ర వర్షాభావ ప్రభావంతో పాటు కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. తక్కువ ఓల్టేజీ, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నారు. సబ్స్టేషన్ల లాగ్బుక్స్లో రోజుకు 17 నుంచి 18 గంటలు త్రీఫేజ్ విద్యుత్, 6 నుంచి 7 గంటలు సింగిల్ ఫేజ్ విద్యుత్ ఇస్తున్నట్లు నమోదు చేసినప్పటికీ వాస్తవంగా అంత సమయం విద్యుత్ అందడం లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తప్పుడు రికార్డులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు యాప్ విధానంతో సకాలంలో యూరియా, ఎరువులు అందడం లేదన్నారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతుందన్నారు. కాళేశ్వరం, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల సామర్ాధ్యన్ని ప్రభుత్వం సక్రమంగా వినియోగంచడం లేదని, కాలువలకు నీరందక చెరువులు ఎండిపోవటంతో భూగర్భజలాలు తగ్గి రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజలకు తాగునీరు సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, స్థానిక సర్పంచ్ వడ్డె మాధవీసైదిరెడ్డి, ఉప సర్పంచ్ బండారు కృష్ణ, వార్డు సభ్యులు బండారు విజయ్కుమార్, బండారు అంజయ్య, మహేష్, మహేందర్రెడ్డి, సైదులు ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


