చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందగా.. గ్రామస్తులంతా కలిసి అతడి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. ఏపీలోని కర్నూలుకు చెందిన గంగుల సుబ్బారావు(85) 1975లో సూర్యాపేటకు వలస వచ్చాడు. 30 ఏళ్ల పాటు సూర్యాపేటలో హోటల్ నిర్వహిస్తూనే నాటకాలు, రంగస్థలం పట్ల ఉన్న ఆసక్తితో వివిధ గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆ తర్వాత చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అతడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావు మంగళవారం మృతి చెందారు. దీంతో గ్రామస్తులంతా కలిసి సుబ్బారావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పి. సైదులు, మాజీ సర్పంచ్ ధరావతు రాజు, మాజీ ఎంపీపీ యశోదవెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఒంటరిగా ఉంటున్న పేద
కళాకారుడికి అంత్యక్రియలు


