తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ఇక్కడ ఎప్పుడూ నలుగురు సిద్ధంగా ఉంటారట. ఏసీబీ దాడులు జరిగినా, అధికారులు సోదా లు చేస్తున్నా ఇక్కడ అక్రమాలకు అడ్డుపడదనే ప్ర చారం ఉంది. ఇక్కడకు వచ్చిన అధికారులు కార్యాలయాన్ని గాడిలో పెట్టకుండా తమ పబ్బం గడుపుకొని వెళ్లిపోతుంటారని అంటుంటారు. పట్టణంలోని ఓ లిటిగెంట్ ఆస్తికి సంబంధించిన వ్యవహారంతో ఈ కార్యాలయం వార్తల్లో కెక్కింది. తదనంతర పరిణామాల్లో అధికారుల ఆటలో ఉద్యోగులు పావులుగా మారుతున్న వాతావరణం కనిపిస్తోంది. అలాగే కూటమి రాజకీయ క్రీనీడ కూడా ఇందులో ఉన్నట్టు భావిస్తున్నారు.
అంతా ఆ రైస్మిల్లు చుట్టే..
పట్టణంలో కృష్ణా రైస్ మిల్లు వన్, టు, త్రీ పేరిట ఉన్న భూముల వ్యవహారానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పలు మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పవర్, వ్యాజ్యాలు చివరకు హైకోర్టు వరకు వెళ్లాయి. పది వేల గజాల స్థలం పవర్ ఉన్నట్టుగా చెబుతున్న ఇద్దరు వ్యక్తుల పేరిట ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. కృష్ణా రైస్ మిల్లు వ్యవహారంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ జలసూత్రం జయప్రకాష్ సస్పెండ్ అయ్యారు. అలాగే ఐజీ అంబేడ్కర్ సోదాలు చేసి సబ్ రిజిస్ట్రార్ పి.శేఖర్ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుత ఇన్చార్జి రిజిస్ట్రార్ శ్రీధర్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పట్టణ ఎస్సై బాదం శ్రీనివాసు 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో కొందరు కూటమి సానుభూతిపరులు ఉన్నారు. ఇదిలా ఉండగా శ్రీధర్ ఆరోగ్య కారణాలతో శనివారం కార్యాలయానికి రాకపోవడంతో కా ర్యకలాపాలు జరగలేదు. అనంతరం ఆయన సె లవు పెట్టారు. దీంతో గతంలో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి ఏలూరులో పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని ఇక్కడ ఇన్చార్జి రిజిస్ట్రార్గా చేరడానికి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రసాద్ సోమవారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది.
ఆ నలుగురే..
రాష్ట్రంలోని ఏ భూమి, ఆస్తి రిజిస్ట్రేషన్ కావాలంటే గూడెం నియోజకవర్గంలో నలుగురుని సంప్రదిస్తే చాలు. ఇక్కడి రిజిస్ట్రార్ కార్యాలయం భ్రష్టుత్వం పట్టడంలో వీరే కారణమనే చర్చ జరుగుతోంది. పెంటపాడు మండలం దర్శిపర్రుకి చెందిన ఓ దళారి కృష్ణారైస్ మిల్లు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చక్రం తిప్పారని సమాచారం. అలాగే తణుకు, కడకట్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు దళారులు, ఉంగుటూరు మండలానికి చెందిన కూటమి నాయకుడొకరు ఆ నలుగురిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో భూదానోద్యమ భూములు, యజమానులు ఎక్కడో ఉండి పర్యవేక్షణ లోపించిన భూములపై వీరు కన్నేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ప్రచారం ఉంది.


