యలమంచిలి: ఆక్వా రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సోమవారం అమలాపురంలోని క్షత్రియ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు బోణం వెంకట నరసయ్య (చినబాబు) తెలిపారు. పాలకొల్లు కాస్మో క్లబ్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని రైతులంతా సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చా రు. మూడు నెలల్లో మేత ధర కిలోకు రూ.21 పెరగడంతో ఆక్వా రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించకపోతే మేత ఉత్పత్తిని ఆపేస్తామంటూ తయారీదారులు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం తలొగ్గితే ఆక్వా రైతులంతా సాగును నిలిపివేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం రొయ్యల ధర పెంచకుంటే నష్టాలు భరిస్తూ సాగు చేయలేమన్నారు. దీనికి సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సంఘ కార్యదర్శి పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు మాట్లాడుతూ రైతు నిద్రావస్థ నుంచి మేల్కోవాలని కోరారు. సంఘ నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఫీడ్ ధరలు పెంచడం, రొయ్యల ధర తగ్గించడంతో రెండు రకాలుగా ఆక్వా రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరారు. సంఘ సభ్యులు కనపర్తి నరసింహస్వామి, అంగర వరప్రసాద్, జి ఈశ్వర కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం


