ఆలయ ఆగ్నేయ దిశలో ఉన్న ప్రహరీ గోడకు కన్నం కొట్టి లోపల ఉన్న జనరేటర్ను బయటకు తీశారు. ఇప్పుడు ఆ గోడను పూర్తిగా తొలగించి, అక్కడ షాపులు నిర్మించి తమ పేరుతో శిలాఫలకం వేయించుకోవాలని పాలకమండలి (కొంత మంది సభ్యులకు తెలియకుండా జరుగుతున్నట్టు సమాచారం) ఉవ్విళ్లూరుతోంది. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా, కూల్చాలన్నా పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. గతేడాది కార్తీకమాసంలో కురిసిన భారీ వర్షాలకు పడమర దిశలో (గోలీగుంట సరిహద్దు) ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. పది నెలలవుతున్నా పురావస్తుశాఖ అనుమతులు లేవనే సాకుతో దానిని పునర్నిర్మించలేదు. పడిపోయిన గోడను కట్టడానికి అనుమతులు తీసుకురాలేని అధికారులు.. ఇప్పుడు షాపుల నిర్మాణం కోసం తూర్పు ప్రహరీని పగలగొట్టడానికి అనుమతులు ఎలా తెచ్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది.


