● పూల ధరలు మూడింతలు
● టాపు లేపిన టెంకాయలు
● వరలక్ష్మీ వ్రత ప్రభావం
ద్వారకాతిరుమల: వరాల తల్లి వరలక్ష్మీదేవిని కొలిచే పర్వదినం సందర్భంగా పూజా సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే పూలు, పండ్లు, కొబ్బరికాయల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా పూలు, పండ్ల దు కాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
చుక్కలు చూపించిన పూల ధరలు
డిమాండ్ దృష్ట్యా వ్యాపారులు పూల ధరలను అమాంతం పెంచేవారు. కిలో చామంతి పూలు రూ.300 నుంచి గురువారం రూ.1,000కు చేరా యి. తమలపాకుల ధర డజను రూ.20 పలికింది. సైజును బట్టి ఒక్కో కొబ్బరికాయ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయించారు. డజన్ అరటిపండ్ల ధర రూ.60కి చేరింది. నైవేద్యానికి సమర్పించే ఆపిల్, దానిమ్మ తదితర పండ్ల ధరలకూ రెక్కలొచ్చాయి. దీంతో పండుగ నిమిత్తం ప్రజలు నామమాత్రంగానే వీటిని కొనుగోలు చేశారు.
సందడిగా మార్కెట్లు
పండుగ పూజ కోసం పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాలు కలకళలాడాయి. అయితే ధరల భారం వల్ల వినియోగదారులు కొనుగోళ్లలో కోత విధించారని, అనుకున్న స్థాయిలో వ్యాపారం సాగలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.


