ఏలూరు టౌన్: రైలులో ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. సికింద్రాబాద్ నుంచి జార్ఖండ్ వెళ్లేందుకు రైలులో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. రైలు విజయవాడ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం ప్రయాణికుడు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు మెడికల్ ఎమర్జెన్సీపై ఏలూరు రైల్వే స్టేషన్లో అతడ్ని దించారు. రైల్వే హాస్పిటల్ వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కమలేష్ చౌదరిగా గుర్తించారు. అనారోగ్యంతో కమలేష్ మృతి చెందటంతో ఏలూరు రైల్వే పోలీసులు సాధారణ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు.
తణుకు అర్బన్: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. తణుకు రూరల్ ఎస్ఐ నాళం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూరులో నివసిస్తున్న ఒగ్గువోలు వాణి అలియాస్ రోజా (43) 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి, గ్రామానికి చెందిన కాళిదాసు చిన్నారావు అలియాస్ చిన్నితో సహజీవనం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో చలనం లేకుండా పడి ఉండడంతో, ఆమె కుమారుడు విజయ్కుమార్కు చిన్ని ఫోన్ చేసి తెలిపారు. ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించిన కుమారుడు, తన తల్లి చనిపోయినట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


