యువతి గల్లంతు
పాలకోడేరు: ప్రేమ వ్యవహారంలో నిరాశకు గురైన ఓ ప్రేమజంట కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గొరగనమూడి లాకుల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కుముదవల్లికి చెందిన తురగళ్ల సందీప్ కుమార్ (22), పినతల్లి వద్ద ఉంటున్న గుడ్ల శ్రీలలిత జగదాంబిక అనే యువతి ప్రేమించుకున్నారు. జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గొరగనమూడి వద్ద ఉన్న వేండ్ర పెద్ద కాలువలోకి ఇద్దరూ ఒకేసారి దూకారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సందీప్కుమార్ను సురక్షితంగా బయటకు తీశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యువతి లలిత కాలువలో కొట్టుకుపోయింది. పాలకోడేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. గల్లంతైన యువతి ఆచూకీ కోసం భీమవరం అగ్నిమాపక కేంద్రం, రెస్క్యూ సిబ్బంది, శిక్షణ పొందిన ఈతగాళ్ల సహాయంతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెనుమంట్ర: పెనుమంట్ర–వీరవాసరం రోడ్డులోని పొలమూరు పెట్రోల్ బంకు వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైక్లిస్టు మృతి చెందాడు. ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లకు చెందిన చెల్లబోయిన నాగరాజు (55) తన కుమార్తెను చూసేందుకు పెనుమంట్రకు సైకిల్పై వస్తున్నారు. ఈ క్రమంలో పొలమూరు పెట్రోల్ బంకు సమీపానికి రాగానే వేగంగా వచ్చిన కారు ఆయన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ నేరుగా పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


