భీమవరం: మద్యం షాపులు పెంచాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి హెచ్చరించారు. శనివారం భీమవరంలో కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన సంఘ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన భీమవరం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు కల్లుగీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లుగీత వృత్తిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా, ప్రభుత్వం ఆదుకోకపోయినా బ్రతుకుతెరువు కోసం తాటి చెట్లు ఎక్కుతూ జీవనం సాగిస్తున్న గీత కార్మికుల పొట్టలు కొట్టడం అన్యాయమన్నారు.
భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షకు 34 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్కుమార్ తెలిపారు. మొత్తం 450 మంది అభ్యర్థులకుగాను 416 మంది హాజరయ్యారని, పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆయన వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శనివారం నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి మొత్తం 329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 167 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 162 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయి. పరీక్షలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎక్కడా ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.2,32,549 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిర్వహించిన ధర్మకర్తల మండలి సాధారణ సమావేశంలో పలు అభివృద్ధి పనుల టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన వెల్లడించారు. స్వామివారి గర్భాలయ ద్వారాలకు వెండి తాపడం వేయడంతో పాటు, అన్నదాన భవనంలో భక్తుల సౌకర్యార్థం స్టీలు బల్లలు, వంటల తయారీకి స్టీమ్ సౌకర్యం కల్పించే పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారికి విశేష అలంకరణ జరిపించారు. ఉదయం 6 గంటల నుంచి మొదటి మార్గంలో భూవరాహ స్వామి దర్శనం అనంతరం భక్తులు ఏడు శనివారాల కాలినడక దీక్షలు ప్రారంభించారు. దీక్షాపరుల కోసం ప్రత్యేక ఉచిత దర్శనం, అష్టోత్తర పూజల నిమిత్తం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన మండపంలో ఉచిత అన్న ప్రసాద వితరణ చేపట్టారు. దాతలను ఆలయ మర్యాదలతో శేషవస్త్రాలు కప్పి, ప్రసాదాలతో ఘనంగా సన్మానించారు.


