99,598 మంది మృతి చెందిన ఓటర్ల తొలగింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితా విడుదలైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ముసాయిదా జాబితాను అందజేశారు. ప్రధానంగా రెండు జిల్లాల్లో మృతి చెందిన ఓట్లు సుమారు 99 వేల పైగా, అలాగే వలస వెళ్ళిన ఓట్లు 46 వేలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రెండు జిల్లాలో సమావేశాలు
సర్ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమలో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగ్గా, పశ్చిమగోదావరిలో డీఆర్వో బి.పెంచల ప్రభాకర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, క్లయిమ్స్ పరిష్కార ప్రక్రియ, తప్పులు లేకుండా చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పశ్చిమలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా 13,89,592 ఎలక్ట్రోరల్ ఫామ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే 43,746 మంది ఓటర్లు మృతి చెందిన కారణంగా తొలగించారు. 22,131 మంది వలస వెళ్లడంతో ఓట్లను తొలగించారు. అలాగే ఇతర ప్రాంతాల్లో నమోదైన ఓట్లు 15,676 ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇక ఏలూరు జిల్లాలో 16,44,193 మంది ఓటర్లు ఉండగా 6,12,979 మంది మ్యాపింగ్ పూర్తయింది. ఇక 1,02,472 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేర్చారని, క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు శాశ్వత వలస వెళ్లినవారు, రెండు ఓట్లు ఉన్నవారు, మృతి చెందిన వారి పేర్లను తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. ఇక జిల్లాలో 651 సర్వీ సు ఓట్లు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు క్లయిమ్లు, దరఖాస్తులు చేసుకోవచ్చని, కొత్త ఓటు నమోదు, అడ్రస్ మార్పులు, సవరణ, తదితర అంశాలకు నెల రోజుల సమయం ఉందని ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి, అక్టోబర్ 3న తుది జాబితా ప్రకటిస్తామని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు.
ఏలూరు జిల్లాలో 55,852 మంది ఓట్లను మృతి చెందిన కారణంగా తొలగించారు. డెత్ సర్టిఫికెట్ ప్రామాణికంగా తీసుకుని వీటిని తొలగించారు. చింతలపూడిలో అత్యధికంగా 12,172 ఓట్లు ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 43,746 ఓట్లను తొలగించారు. వీటిలో అత్యధికంగా తణుకు నియోజకవర్గంలో 7,685 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా ఏలూరు జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వలస వెళ్లిన ఓటర్లు 24,034 మందిగా గుర్తించారు. పోలవరం నియోజకవర్గంలో 4,366 ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరిలో 22,131 ఓట్లను గుర్తించారు. వీటిలో తణుకులో 6,600 ఓట్లు అత్యధికంగా ఉన్నాయి.
ఏలూరులో 15,41,650 మంది ఓటర్లు
పశ్చిమలో 14,75,036 మంది ఓటర్లు
ఏలూరులో 55,852, పశ్చిమలో 43,756 మంది మృతి చెందిన ఓట్లు తొలగింపు
ఏలూరులో 24,036, పశ్చిమలో 22,131 వలస ఓట్లు తొలగింపు
రాజకీయ పార్టీలతో రెండు జిల్లాల్లో అధికారుల సమావేశం


