దెందులూరు: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం ఈనెల 11వ తేదీన కాకినాడలో జరుగుతుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ తెలిపారు. గురువారం ఏలూరు రూరల్ మండలం మానూరులో ఆయన నివాసంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు విధిగా హాజరుకావాలన్నారు. పార్టీ బలోపేతం, సమస్యల పరిష్కారం, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో దిశానిర్ధేశం చేస్తారని ఆనంద్ తెలిపారు.
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
భీమవరం: తప్పిపోయిన ఓ చిన్నారిని జిల్లా పోలీస్ యంత్రాంగం సురక్షితంగా తల్లికి అప్పగించిన ఘటన ఇది. వివరాల్లోకి వెళ్తే, గురువారం మధ్యాహ్నం సుమారు 3:45 గంటల సమయంలో భీమవరం మారుతి టాకీస్ సమీపంలోని గులాబీ సెంటర్ వద్ద ఒక ఏడేళ్ల చిన్నారి ఒంటరిగా ఏడుస్తున్నట్లు డయల్ 112 హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే భీమవరం వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు తన సిబ్బందితో కలిసి నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర భయాందోళనలో ఉన్న ఆ చిన్నారితో సీఐ నాగరాజు మాట్లాడి వివరాలు సేకరించారు. సమాంతరంగా జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి, వారి పర్యవేక్షణలో చిన్నారికి రక్షణ కల్పించారు. ఆ పాప పట్టణంలోని సర్రాజు గారి వీధికి చెందిన సోడాదాసి మాధవి కుమార్తెగా గుర్తించారు. అనంతరం, చైల్డ్ ప్రొటెక్షన్ నిబంధనలను పాటిస్తూ, తగిన ఆధారాలను ఽధ్రువీకరించుకున్న తర్వాత చిన్నారిని తన తల్లికి క్షేమంగా అప్పగించారు. ఆపదలో ఉన్న తన బిడ్డను అత్యంత వేగంగా గుర్తించి అప్పగించిన పోలీసుల చొరవకు, సీఐ నాగరాజుకు ఆ తల్లి కృతజ్ఞతలు తెలియజేసింది.
భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పట్టిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 8వ తేదీన భీమవరం విష్ణు కాలేజీలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లోని చాంబర్ నందు సీ్త్ర, శిశు సంక్షేమం, డీఆర్డీఏ, మెప్మా, విద్యాశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. అన్ని నియోజకవర్గాల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను గుర్తించి సన్మానించాలని సూచించారు.
దాళ్వా ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి
ఉగాది అనంతరం రైతుల నుంచి దాళ్వా సీజన్ ధాన్యం కొనుగోలుకు అధికారులు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జేసీ సమీక్షించారు.
ఏలూరు టౌన్: ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఏలూరు రూరల్ వైఎస్సార్ కాలనీలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ను ఏలూరు పోలీస్, ఈగల్ టీమ్ సభ్యులు సంయుక్తంగా చేపట్టారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో గురువారం తెల్లవారుజాము నుంచే వైఎస్సార్ కాలనీ, పోణంగి ప్రాంతాల్లో పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీస్, ఈగల్ టీమ్ పోలీసులు సుమారు 50 మందికిపైగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. రెండు ప్రాంతాలను పూర్తిగా పోలీస్ అధికారులు, సిబ్బంది దిగ్బంధించారు. మరోవైపు డ్రోన్ కెమెరాలతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. ఈ ఆపరేషన్లో సుమారు 14 సరైన పత్రాలు లేని మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


