భీమవరం: ఆటోలో బంగారు నగలు చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం.నాగరాజు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ వెల్లడించారు. పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన బొక్కా వీరవేణి గతనెల 27వ తేదీన ఆటోలో ప్రయాణిస్తుండగా సుమారు 59 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తు తెలి యని వ్యక్తులు దొంగిలించారు. బాధితురాలు ఈనెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను నిశితంగా పరిశీలించి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించినట్లు సీఐ తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులు తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లి గ్రామానికి చెందిన పాట్నాల పోలమ్మ, పొరిపిరెడ్డి చాందినీలను పట్టణంలోని ప్రకాశంచౌక్ సెంటర్లో బుధవారం అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు సీఐ నాగరాజు చెప్పారు.


