ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఈనెల 20న శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేషవాహనంపై ఊరేగింపుగా ఉగాది మండపం వద్దకు తరలివెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణం జరుపుతారు.
శ్రీవారి సాయంకాలార్చన సమయంలో మార్పు
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 14 నుంచి స్వామి వారి సాయంకాలార్చన సమయాన్ని మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సాయంకాలార్చనను నిత్యం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. సూర్యాస్తమయ మార్పునకు అనుగుణంగా ఈ నెల 14 నుంచి ఈ సాయంకాలార్చనను సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అర్చకులు నిర్వహిస్తారని ఈఓ తెలిపారు. అర్చన సమయంలో నిలిచిపోయిన శ్రీవారి దర్శనాన్ని తిరిగి రాత్రి 7 గంటల నుంచి భక్తులకు కల్పిస్తామని, ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.


