శాసనమండలిలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో అర్బన్ ఆరోగ్య కేంద్రం ప్రజలకు వినియోగంలో లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ శాసనమండలి దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం మండలిలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 2023లో గత ప్రభుత్వ హయాంలో పూర్తి సౌకర్యలతో నిర్మించారని, కేవలం కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో ఈ ఆరోగ్య కేంద్రం ప్రజలకు వినియోగంలోకి రాలేదని అన్నారు. ఈ సెంటర్ చుట్టుపక్కల సుమారుగా 25 వేల జనాభా ఉన్న కారణంగా గత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ప్రతిపాదించి పని కూడా పూర్తి చేసిందని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నప్పటికీ ప్రజలకు వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల అలస్వతానికి నిదర్శనమన్నారు.
ఉండి: ఈ నెల 3, 4 తేదీల్లో సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. మండలంలో ప్రధానమైన బొండాడ మేజర్ డ్రెయిన్తో పాటు మీడియం, మైనర్ డ్రెయిన్లు గుర్రపు డెక్క, తూడు, చెత్తచెదారంతో నిండిపోయాయి. దీంతో మండలంలోని ఆరేడు, పాందువ్వ, కోలమూరు, యండగండి, చిలుకూరు, ఎన్నార్పీ అగ్రహారం, ఉండి, వెలివర్రు, మహదేవపట్నం తదితర గ్రామాల్లోని వరిపంటతో పాటు పాలకోడేరు, ఆకివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా పంట ముంపునకు గురికావడంతో రైతులు లబోదిబోమన్నారు. సాక్షిలో వచ్చిన కథనాలకు అధికారులు బుధవారం స్పందించారు. పొక్లెయిన్ సాయంతో అక్విడెక్టు వద్ద మేటలు వేసిన డెక్క తూడును తొలగించి ట్రాక్టర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు దానిని తరలిస్తున్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): బుధవారం భీమవరం న్యూ బస్స్టేషన్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.గిరిధర్ కుమార్, అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్, ఆన్కాల్ డ్రైవర్స్, హైర్ బస్సు డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. డీపీటీఓ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఉదయం, సాయంత్రం బస్సుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సర్వీసులు జాగ్రత్తగా నడపాలన్నారు.
భీమవరం: సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం పోలీసులతో దాడిచేయించి అక్రమ అరెస్టులు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తుందని ధ్వజమెత్తారు. అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలు తీర్చాలని విన్నవించుకోవడానికి విజయవాడ వస్తే పోలీసుల బలగాలను ఉపయోగించి లాఠీచార్జ్ చేయడం, ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. స్కీమ్ వర్కర్స్కు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలు కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆక్వా రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఫీడ్, సీడ్ ధరలు ప్రభుత్వ కంట్రోల్ ఉండాలన్నారు.


