
నిరుపేదల బతుకులు రోడ్డు పాలు
మాపై ఎందుకు కక్ష?
మా బతుకులు ఇంతేనా?
ఉండి: డ్రెయిన్ గట్టున ఉంటున్న వారి గుడిసెలను కూలగొట్టి విద్యుత్ మీటర్లు తొలగించి వారిని వెళ్లగొట్టారు. నిరుపేదలైన ఏమీ చేయలేరు కదా అని వారిపై అధికారులు జులుం చేశారు. విద్యుత్ మీటర్లను పట్టుకుపోయారు. సోమవారం ఉదయం ఉండి 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కొందరు పేదలు అధికారులను వేడుకుంటూ నిలబడ్డారు. ఈ సందర్భంగా వారి ఆవేదనంతా వెలిబుచ్చారు. కొంతకాలం క్రితం నుంచి ఉండిలో మసీదుకు ఎదురుగా అరుంధతీపేటకు వెళ్ళే దారిలో బొండాడ డ్రెయిన్ పక్కనే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వాటికి విద్యుత్ మీటర్లు మంజూరు చేశారు. దీంతో నీడ లేక నానాపాట్లు పడుతున్న వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయనుకున్నారు. ఊరూరా తిరిగి వేషాలు వేసుకుని జీవించే వారి జీవితాలకు ఒక స్థిర నివాసం, అడ్రస్సు ఏర్పడింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లభించాయి. వారి పిల్లలు ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. గౌరవప్రదంగా జీవించాలని వారు కన్న కలలు కూటమి నాయకుల రూపంలో దూరమవుతుందని వారు కలలో కూడా అనుకోలేదు. కూటమి నాయకులు చేసిన పనికి నాలుగు గుడిసెల్లో వుంటున్న 8 కుటుంబాలకు చెందిన నిరుపేదలు నిలువనీడ లేక రోడ్డుపై నిలబడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఏదో కడుతున్నారని గుడిసెలను తొలగించారు. ఇప్పటికీ ఏ పని ప్రారంభించలేదు. తమ జీవితాలు చిందర చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాళ్లావేళ్లా పడ్డా కరుణించని అధికారులు
అధికారులను, ప్రజాప్రతినిధులను ఎదురించే ధైర్యం లేక ఎంతో మందిని సహాయం కోసం అర్థించారు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వారికున్న కొన్ని సామాన్లు తీసుకుని ఉండిలోనే విద్యుత్ సబ్స్టేషన్ పక్కనే ఓ ఖాళీస్థలంలో బరకాలు, పాతబట్టలతో గుడిసెలు వేసుకున్నారు. ఒకవైపు విషసర్పాలు, మరోవైపు చిమ్మచీకటితో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. పిల్లలు చదువులకు దూరం కావడంతో ఏం చేయాలో పాలుపోక సోమవారం విద్యుత్ అధికారులకు దండాలు పెడుతూ ఆఫీసు ముంగిట భార్య బిడ్డలతో నిలబడ్డారు. మమ్మల్ని కనికరించి మాకు విద్యుత్ మీటర్లు ఇప్పిస్తే మా బతుకులు మేం బతుకుతాం.. మాకు దారి చూపించండి బాబూ అంటూ కాళ్ళా వేళ్లా పడ్డారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారని.. మా జీవితాల్లో చాలా అభివృద్ది వస్తుందని ఊహించిన వారికి నిలువనీడ లేకుండా పోతుందని అనుకోలేదని వారు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ మీటర్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి అనిల్ లెటర్ పెట్టారని, అందుకే మీటర్లను తొలగించామని ఏఈ పులగం శ్రీనివాస్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు.
బొండాడ డ్రెయిన్ గట్టుపైన గుడిసెలు కూల్చివేత
నీడలేక నానా పాట్లు పడుతున్న పేదలు
15 మంది చిన్నారులు చదువులకు దూరం
నా చిన్నతనం నుంచి ఉండిలోనే వుంటున్నాం. బతికేందుకు జాగా లేదు. చివరకు ఉండి బొండాడ డ్రెయిన్ పక్కగా గుడిసెలు వేసుకుని ఒక జీవితాన్ని ప్రారంభించాం. మా పిల్లలకు మా పరిస్థితి రాకుండా మంచి జీవితం ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు మా ఇళ్లు అడ్డొస్తున్నాయని తీసేసారు. తనుకు గొల్లమ్మ, బాధితురాలు, ఉండి
మా పిల్లల్లి బాగా చదివించుకోవాలని స్కూళ్ళకు పంపుతున్నాం. మా గుడిసెలు తొలగించి మా పిల్లల చదువులకు అడ్డుపడ్డారు. మా పిల్లలు బడికి రావడం లేదని టీచర్లు ఫోన్లు చేస్తున్నారు. మేము రోజుకొక చోట ఉంటున్నాం. అందుకే మా పిల్లల్ని బడికి ఎలా పంపాలి. తనుకు మరిడమ్మ, బాధితురాలు, ఉండి

నిరుపేదల బతుకులు రోడ్డు పాలు

నిరుపేదల బతుకులు రోడ్డు పాలు