విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు

Apr 20 2025 1:10 AM | Updated on Apr 20 2025 1:27 AM

విలీన

విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు

లోఓల్టేజీ సమస్య

తెలంగాణలో ఉన్నప్పుడు సమస్య వస్తే బూర్గంపాడు నుంచి లేకపోతే అశ్వారావు పేట నుంచి విద్యుత్‌ సరఫరా చేసేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుంచి లోఓల్టేజీ సమస్య వేదిస్తోంది. ఇప్పటికీ మా ఊరిలో లోఓల్టేజీతో గృహోపకరణాలు సరిగా పనిచేయడంలేదు. దీనిపై గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసినా ఫలితం లేదు.

– నకిరికంటి వెంకటేశ్వర్లు, కొండపల్లి, కుక్కునూరు

గంటల తరబడి అంతరాయం

వేసవి కాలం వచ్చిందంటే వి ద్యుత్‌ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. గడిచిన వారం రోజుల్లో కూడా రాత్రి మొత్తం విద్యుత్‌ సరఫరా లేక పిల్లాపాపలతో చాలా ఇబ్బంది పడ్డాం. పోలవరం ప్రాజెక్టు పేరుతో మా మండలాలను విలీనం చేసుకుని మా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.

– పేరాల నరసింహారావు, కొండపల్లి, కుక్కునూరు

ఈదురుగాలులతో తరచూ నిలిచిపోతున్న విద్యుత్‌

జంగారెడ్డిగూడెం నుంచి సరఫరాలో అవాంతరాలు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రజలు

కుక్కునూరు: విలీన మండలాలను విద్యుత్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వేసవి వచ్చిందంటే విద్యుత్‌ సమస్యతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరు మధ్యలో ఎక్కడ బలంగా గాలులు వీచినా గంటల తరబడి విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో సరఫరా పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.

జంగారెడ్డిగూడెం నుంచి రావాల్సిందే..

ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు జంగారెడ్డిగూడెంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కుక్కునూరు మండలంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా కావాలంటే జంగారెడ్డిగూడెం నుంచి మైసన్నగూడెం, ములగలంపల్లి, పి.నారాయణపురం, రాచన్నగూడెం, వేలేరుపాడు గ్రామాల్లోని సబ్‌స్టేషన్ల నుంచి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మధ్యలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఏర్పడినా విలీన మండలాల ప్రజలు చీకట్లలో మగ్గాల్సిందే.

అటవీ ప్రాంతం కావడంతో..

జంగారెడ్డిగూడెం నుంచి కుక్కునూరుకు సుమారు 100 కిలోమీటర్ల దూరం. ములగలంపల్లి నుంచి కుక్కునూరు మధ్య అటవీ ప్రాంతం మీదుగా విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో తరచూ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతుండటంతో విద్యుత్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరి

కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రా విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా మారింది. దీనిపై పలుమార్లు ప్రజలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. అల్లూరి జిల్లాలోని ఎటపాక 132 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి గోదావరి మీదుగా టవర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ను అందించాలని, లేకుంటే వేలేరుపాడు మండలంలోని మేడిపల్లి వద్ద 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ఆ దిశగా అధికారులు కూడా సర్వే చేసినా ఏదీ కార్యరూపం దాల్చలేదు.

విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు 1
1/2

విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు

విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు 2
2/2

విలీన మండలాల్లో కరెంట్‌ కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement