గీసుకొండ: జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్సీడీ) కింద నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజారెడ్డి అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎన్సీడీ నర్సింగ్ ఆఫీసర్లు, నోడల్ పర్యవేక్షకులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, నిర్ధారణ చేసి చికిత్స అందించాలని కోరారు. తద్వారా వ్యాధుల తీవ్రత, ఆకస్మిక మరణాలు తగ్గించవచ్చని తెలిపారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సయ్యద్ ఇక్తిదార్ అహ్మద్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎన్సీడీ జిల్లా కోఆర్డినేటర్లు ఆర్.ప్రకాశ్, ఎన్.శ్రీనివాస్ కర్ణ తదితరులు పాల్గొన్నారు.


