● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని
దుగ్గొండి: నిస్వార్థ కమ్యూనిస్టు యోధుడు పీసీఆర్ (పుచ్చకాయల చంద్రారెడ్డి) అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. నాచినపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పుచ్చకాయల చంద్రారెడ్డి 12 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈమేరకు ఆయన స్వగ్రామంలో శుక్రవారం సంస్మరణ సభ నిర్వహించారు. మొదట సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యూ), బీఆర్ఎస్ నాయకులు పీసీఆర్ చిత్రపటం వద్ద జోహార్లు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో తమ్మినేని ప్రసంగించారు. కమ్యూనిస్టు బాట ముళ్లబాట.. ముళ్లబాటను ఎంచుకుని పూలబాటగా ముందుకు సాగినవారే నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ సంయమనంతో నర్సంపేట డివిజన్లో పార్టీని కాపాడిన ఘనత పీసీఆర్కే దక్కుతుందన్నారు. పార్టీకి చెందిన ప్రతి రూపాయిని సక్రమంగా క్రమశిక్షణగా ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు.
చంద్రారెడ్డి మృతి తీరని లోటు
పుచ్చకాయల చంద్రారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఎంసీపీఐ(యూ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. చంద్రారెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, పోతినేని సుదర్శన్రావు, చూడి కృష్ణారెడ్డి, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల కార్యదర్శులు రంగయ్య, ప్రభాకర్రెడ్డి, సాంబశివ, ఈసంపల్లి బాబు, బోళ్ల సాంబయ్య, స్థానిక సర్పంచ్ పెండ్యాల రాజు, పీసీఆర్ కుటుంబ సభ్యులు మల్లక్క, భాస్కర్రెడ్డి, జనార్దన్రెడ్డి, అరుణశ్రీ పాల్గొన్నారు.


