● కమిషనరేట్లో 2,400 సైబర్ కేసులు నమోదు
● సైబర్ మోసం రూ.6.85 కోట్లు.. రికవరీ రూ.1.60 కోట్లు
● వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు
● ‘సాక్షి’తో సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ
వరంగల్ క్రైం: ఫ్రెండ్ అంటూ పరిచయమవుతారు. తియ్యగా మాట్లాడి స్నేహం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడతారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, సైబర్ క్రైం ఏసీపీ మోట్ల వెంకటరమణ ‘సాక్షి’తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
కేసుల సంఖ్య పెరుగుతోంది..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 2,400 సైబర్ క్రైం కేసులు నమోదయ్యయి. వివిధ రకాల కేసుల్లో బాధితులు రూ.6.85 కోట్లు నష్టపోయారు. గోల్డెన్ అవర్లో టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్చేసి సమాచారం అందించగా.. ఇప్పటి వరకు బ్యాంకుల్లో హోల్డ్ చేసిన డబ్బులు రూ.1.68 కోట్లు రికవరీ చేశాం.
మోసాలు పలు రకాలు..
కస్టమర్ కేర్, ఆన్లైన్ షాపింగ్, పార్ట్టైం జాబ్, స్టాక్ మార్కెట్, గేమింగ్ మోసం, డేటింగ్, స్టాకింగ్, ఏపీకే ఫైల్స్ ఓపెన్, క్రెడిట్కార్డు లిమిట్ పెంపు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్, కేవైసీ అప్డేట్, డిజిటల్ అరెస్టు, లోన్యాప్, మ్యాట్రిమనీ ఇలాంటి రకరకాల పేర్లతో తియ్యగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నారు.
స్నేహం పేరుతో మోసాలు..
మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయం పెంచుకొని ఆ తర్వాత పెళ్లి పేరుతో నేరగాడు ఓ యువతికి దగ్గరయ్యాడు. ఒక రోజు యువతికి ఫోన్ చేసి నా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. నీ పేరుతో మూడు అకౌంట్లు ఓపెన్ చేసి వాటి వివరాలు పంపాలని కోరగా.. నమ్మిన సదరు యువతి మూడు బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంక్ పాస్ బుక్లు, ఏటీఎం కార్డులు అందజేసింది. ఆ తర్వాత అతడు ఆ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించాడు. అనంతరం సైబర్ మోసాల కింద యువతిపై కేసులు నమోదయ్యయి.
అప్రమత్తంగా ఉండకపోతే గోవిందా...
ప్రస్తుతం సైబర్ మోసాలపై అవగాహన లేకపోతే నష్టపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు. ఫోన్నంబర్లు, ఓటీపీలు, ఏటీఎం, డెబిట్ కార్డుల వివరాలు, ఆధార్కార్డులు, అకౌంట్ నంబర్లు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఏదైనా కారణం చేత మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.


