హన్మకొండ అర్బన్: వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన పెరగాలని హనుమకొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సుబేదారిలోని అసుంత భవన్లో పోలీస్, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థంతో ఇతరులను దోపిడీకి గురిచేయడం, వెట్టిచాకిరిలోకి నెట్టడం వంటి ఘటనలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం కల్పించడంతో పాటు సమాజంలో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ కృషి చేస్తుందని కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రామలింగయ్య తెలిపారు.
కాజీపేట రూరల్: ప్రయాణికుల ఫుడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో రైళ్లు, స్టేషన్ ప్లాట్ఫాంలపై యాంటీ హాకింగ్ డ్రైవ్ నిర్వహించినట్లు శనివారం రైల్వే అధికారులు తెలిపారు. జూలై 28 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఈ డ్రైవ్లో రైల్వేశాఖ అనుమతి, ఐడెంటిటీ కార్డు లేకుండా తినుబండారా లు విక్రయిస్తున్న 33 మంది హాకర్స్, వెండర్స్ను అదుపులోకి తీసుకొని రైల్వే ప్రొటెక్షన్ ఫో ర్స్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రైల్వే శాఖ అనుమతించిన హాకర్స్, వెండర్స్ వారు మాత్రమే తినుబండారాలు వి క్రయించాలని, నాణ్యతతో కూడిన ఆహార ప దార్థాలు విక్రయించేలా ఆదేశించినట్లు తెలి పారు. డ్రైవ్లో కమర్షియల్, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు వారు వివరించారు.
మామునూరు: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 7వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ ఎస్.ప్రవీణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
హన్మకొండ అర్బన్: సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలులో హెల్త్ సూపర్వైజర్ల పాత్ర కీలకమని హనుమకొండ డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహిస్తూ డెంగీ, మలేరియా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలని ఆదేశించారు. గర్భిణులను తొలి మూడు నెలల్లోనే నమోదు చేసి హైరిస్క్ కేసులను గుర్తించాలని, హెచ్పీవీ వ్యాక్సిన్ అర్హులైన బాలికలకు అందించి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. 2025లో జిల్లాలో 191 డెంగీ కేసులు నమోదుకాగా, 2026లో ఇప్పటివరకు 21 కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు.


