ఖానాపురం: పాకాల ఆయకట్టుకు బీఆర్ఎస్ నాయకులు నీటిని విడుదల చేయడానికి గురువారం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహలక్ష్మి వెంకటనర్సయ్య ఆధ్వర్యంలో నాయకులు ఉదయం 11.30 గంటలకు బైక్ర్యాలీగా పాకాలకు తరలివెళ్లారు. రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సైలు రణధీర్రెడ్డి, రామ్మోహన్ ముందస్తుగా పాకాలకు చేరుకొని గేట్లకు తాళాలు వేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. గేటు వద్ద బీఆర్ఎస్ నాయకులు లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరిగేషన్ డీఈ రమేశ్ చేరుకొని నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినా నాయకులు వినిపించుకోలేదు. పలువురు నాయకులు గేటు దాటుకొని లోపలకు వెళ్లారు. సంగెం తూము వద్దకు వెళ్లి నీటిని విడుదల చేశారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు కొంత సమయం తర్వాత తూములను మూసివేశారు. ధర్నా చేస్తున్న బత్తిని శ్రీనివాస్, ప్రకాశ్రావు, సర్పంచ్ దాసరి రమేశ్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత నాయకులు ధర్నా విరమించారు. నాయకులు వల్లెపు శ్రీనివాస్, ఉపేందర్రెడ్డి, బాబురావు, భూస అశోక్, బాలకిషన్, శ్రీనివాస్, రవి, వడ్డె రాజశేఖర్, ఉప్పు రాజు, రాము పాల్గొన్నారు.
నీటి విడుదలకు బీఆర్ఎస్
నాయకుల యత్నం
అడ్డుకున్న పోలీసులు


