నర్సంపేట: విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేట పాకాల రోడ్డులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(మోడల్)ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యం, పాఠ్యాంశాలపై అవగాహనను ప్రశ్నల ద్వారా పరీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమర్థవంతమైన బోధనా విధానాలను అమలు చేయాలని, ప్రతి విద్యార్థి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో పరిశుభ్రత, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, బోధన–అభ్యసన వాతావరణాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆర్డీఓ ఉమారాణి, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా డిజిటలైజేషన్ పూర్తిచేయాలి
గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సర్ కార్యక్రమంలో భాగంగా గురువారం నర్సంపేటలోని వల్లభ్నగర్, సాయినగర్ కాలనీల్లో పర్యటించారు. బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్ను గడువులోగా పూర్తిచేయాలని బీఎల్ఓలు, పర్యవేక్షణ అధికారులకు సూచించారు. ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ హరిచంద్రరెడ్డి, కౌన్సిలర్ మండల శ్రీదేవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


