భీమదేవరపల్లి: ముల్కనూరు సహకార సంఘం ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును కై వసం చేసుకుంది. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇక్రిసాట్ వేదికగా గురు, శుక్రవారాల్లో జరిగిన ‘ఇండియా సీడ్ ట్రేడ్ – ఇన్నోవేషన్ సమ్మిట్ 2026’లో ముల్కనూరుకు ‘ఫార్మర్–సెంట్రిక్ ఇంపాక్ట్ ఎక్స్లెన్స్’ అవార్డు లభించింది. సుస్థిర వ్యవసాయం, ప్రపంచ విత్తన వాణిజ్యం, ఆవిష్కరణలపై నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వందలాది ప్రముఖ విత్తన కంపెనీలు, వ్యవసాయ సంస్థల ప్రతినిధులు, రంగ నిపుణులు పాల్గొన్నారు. సమగ్ర విత్తన విలువ గొలుసు విధానం ద్వారా రైతుల జీవనోపాధిని మెరుగుపర్చడంలో ముల్కనూరు సంఘం చేసిన అసాధారణ కృషికి గాను ఈ అవార్డు దక్కింది.
అవార్డు ప్రదానం
రైతు–కేంద్రీకృత కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి ముల్కనూరు అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ చేతుల మీదుగా శుక్రవారం జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈసందర్భంగా ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి మాట్లాడుతూ, ‘ఇంతటి ప్రతిష్టాత్మక జాతీయ వేదికపై ముల్కనూరు సహకార సంఘం సేవలకు గుర్తింపు లభించడం యావత్ తెలంగాణకే గర్వకారణం. ఈ అవార్డును సంఘంలోని రైతు–సభ్యులు, ఉద్యోగులు, భాగస్వాములందరికీ అంకితం చేస్తున్నాం’అని అన్నారు.
ఫార్మర్–సెంట్రిక్ ఇంపాక్ట్
ఎక్స్లెన్స్ అవార్డు
అందుకున్న జీఎం మారుపాటి రాంరెడ్డి


