ఈ ఫొటోలో పత్తి మొలకలకు నీరు పారిస్తున్న రైతు పేరు అంబీర్ శ్రీనివాస్. ఈయనది ఎల్కతుర్తి మండలం చింతలపల్లి. తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి గింజలు నాటాడు. ఇప్పటి వరకు వర్షాలు కురువకపోవడంతో భూమిలోనే గింజలు ఎండిపోతాయన్న భయంతో బోరువేయించాడు. బోరు నీళ్ల ద్వారా నీరు పారిస్తున్నాడు. పొద్దుగూకే వరకు నీరు పారిస్తున్నప్పటికి కనీసం రెండు ఎకరాలు కూడా తడవని పరిస్థితి ఉంది. ‘నీళ్లు ఎల్లిన కాడికి పత్తిమొలకలకు పారిస్తున్నా అక్కడక్కడా సరిగ్గా మొలకలు మొలవని పరిస్థితి ఉంది. మొత్తం నాలుగు ఎకరాలకు తొమ్మిది బస్తాలు పత్తిగింజలు కొనుగోలు చేసి నాటినా. ఎకరానికి రూ.15నుంచి రూ.20వేల పెట్టుబడి అయింది. వరుణిడి దయ. లేకపోతే చేసిన కష్టం.. పెట్టిన పెట్టుబడి భూమిలో పోసినట్లే’ అని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
వానాకాలం ప్రారంభమై నెల దాటినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో సాగు ముందుకు సాగట్లేదు. శుక్రవారం నాటికి 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆతర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పత్తి సాగు చేసిన రైతులు అవి మొలకెత్తక ఆందోళన చెందుతుండగా.. రైతులు పొలాల్లో ముదిరిపోతున్న నారును చూసి దిగులు పడుతున్నారు. వానాకాలం సాగులో ముందుకెళ్లడమా? ఆగిపోవడమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు.
వానాకాలం సాగు లెక్క ఇలా..
రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన సీజన్ అండ్ క్రాప్ కవరేజ్ నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 15.93 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 5,00,220 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. అంటే మొత్తం లక్ష్యంలో 31.42 శాతం మాత్రమే సాగైంది. ఇందులో వరి లక్ష్యం 9.21 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 36,201 ఎకరాల్లో (3.9 శాతం) మాత్రమే సాగయ్యింది. ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తి 5,94,102 ఎకరాల లక్ష్యానికిగాను 4,19,605 (70.62 శాతం) ఎకరాల్లో పత్తి సాగైంది. వరి నాట్లు వేసేందుకు రైతులు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉండగా.. పత్తి సాగు ఎక్కువగా పూర్తయింది. అయితే మొలకెత్తని, ఎండిపోతున్న పత్తి పంట సైతం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
52 మండలాల్లో లోటు, భారీ లోటు..
79 మండలాలకు గాను ఈ వానాకాలంలో ఇంకా 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతమే ఉంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, హసన్పర్తి, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, వరంగల్ జిల్లా గీసుకొండ, నర్సంపేట, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లో భారీగా లోటు వర్షపాతం ఉంది. అలాగే హనుమకొండ జిల్లాలో 8, వరంగల్లో 8, జనగామలో 7, మహబూబాబాద్లో 12, జేఎస్ భూపాలపల్లిలో 7 మండలాలు కలిపి 42 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 41.15 శాతం సాగు పూర్తయ్యింది.
కలిసిరానికాలం..
అన్నదాత అయోమయం
ఉమ్మడి జిల్లాలో ములుగు మినహా ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతం
79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు
వాన జాడ లేదు, సాగు జోరు లేదు.. ఇప్పటికీ 31.42 శాతమే సాగు


