రోడ్డు ఆక్రమించి ఇంటి నిర్మాణం
నల్లబెల్లి: రోడ్డును ఆక్రమించుకుని ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రుద్రగూడెంలో బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామానికి చెందిన గంగారపు లింగయ్య తన కుమార్తె జ్యోతి, చెల్లె విజయతో వాటర్ ట్యాంకు ఎక్కి పురుగుల మందు డబ్బా పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ అధికారులతో కుమ్మక్కై ఎల్లపల్లి రాజు (చింటు) రోడ్డును కబ్జాచేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే వచ్చి రోడ్డు ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్య తీసుకోకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతామని హెచ్చరించారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్సై గోవర్ధన్ సంఘటనా స్థలానికి పోలీస్ సిబ్బందితో చేరుకున్నారు. ఆందోళన విరమించాలని గంగారపు లింగయ్య, కుటుంబ సభ్యులను కోరారు. నర్సంపేట ఆర్డీఓ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించి దిగివచ్చేదిలేదని వారు భీష్మించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎస్సై తీసుకువెళ్లారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తాహసీల్దార్ కృష్ణ ఆందోళన చేస్తున్న లింగయ్యతో ఫోన్లో మాట్లాడారు. గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కబ్జాదారుడిపై అధికారులు
చర్య తీసుకోవాలి
వాటర్ ట్యాంక్ ఎక్కి బాధితుల డిమాండ్
రుద్రగూడెంలో ఉద్రిక్తత..
పోలీసుల రంగప్రవేశం
వాటర్ ట్యాంకు దిగేందుకు ఇబ్బంది
వాటర్ ట్యాంక్పై లింగయ్య సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేశారు. ఆందోళన విరమించి కిందికి దిగేందుకు ప్రయత్నించగా ఆరోగ్యం సహకరించలేదు. ఎస్సై గోవర్ధన్, ఫైర్స్టేషన్ సిబ్బంది అక్బర్ తదితరులు లింగయ్యను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు.


