‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Mar 20 2025 1:35 AM | Updated on Mar 20 2025 1:35 AM

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

వరంగల్‌: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, నలుగురు కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని సూచించారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్‌ కల్పించడంతోపాటు ఏఎన్‌ఎం, ఫస్ట్‌ఎయిడ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉండాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రూట్లలో ప్రశ్న, జవాబుపత్రాల తరలింపు సమయంలో పోలీసు అధికారులు తప్పనిసరిగా ఉండాలని, మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను కోరారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్‌, డీఈఏసీ కె.అరుణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

దివ్యాంగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి ఆధ్వర్యంలో కలెక్టర్‌ సత్యశారద అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్‌్స్‌ హాలులో జరి గింది. జిల్లా కమిటీ సభ్యులు దివ్యాంగుల సమస్యలను వివరించారు. కలెక్టర్‌ స్పందించి సంబంధిత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జీడబ్ల్యూఎంసీ డీసీ రాజశేఖర్‌, డీఈఓ జ్ఞానేశ్వర్‌, ఏసీపీ తిరుపతి, ఆర్టీఓ శోభన్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సంతోషి, ఎల్‌డీఎం రాజు, ఆర్టీసీ సూపరింటెండెంట్‌ సర్వోత్తమ్‌రెడ్డి, ఎంజీఎం ఆర్‌ఎంఓ శ్రీనివాస్‌, జిల్లా కమిటీ సభ్యులు అంబటి రాజేందర్‌, బండి చక్రపాణి, సతీ ష్‌, పిన్నింటి రవీందర్‌, వీరన్న నాయక్‌, నర్సక్క, రవీందర్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌పై సమీక్ష

సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌, విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాలపై కలెక్టర్‌ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ప్రొసీడింగ్‌ ఇస్తే ప్రజలు ముందుకు వస్తారని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి తొందరగా మార్కింగ్‌లు ఇచ్చి బేస్మెంట్‌ లెవెల్‌కు తీసుకురావాలని, రెండో దశలో మంజూరైన ఎల్‌–1 జాబితా త్వరగా వెరిఫై చేయాలని, అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించి ఎల్‌–1 జాబితా ఫైనల్‌ చేసి ఈనెల 25 లోపు పంపించాలని ఎంపీడీఓలను కోరారు. డీపీఓ కల్పన మాట్లాడుతూ మండలాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలను ఎప్పటికప్పుడు క్రమంగా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాటు

విద్యార్థులకు వసతులు కల్పించాలి

అధికారుల సమీక్షలో కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement