ఖిల్లాఘనపుర: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీగా భూ రీసర్వే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం మండలంలోని మల్కాపురం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ–సర్వేను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి పరిశీలించారు. రోవర్ల వినియోగం, ఆధునిక సాంకేతికతో సర్వేయర్లు భూములు కొలుస్తున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో చూశారు. భూములు కొలిచే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూ రీ సర్వేకు మల్కాపురం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై ందన్నారు. గ్రామ శివారులోని భూములకు సంబంధించి రికార్డులు సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులు గుర్తించి వివాదాలను పరిష్కరిస్తారని తెలిపారు. డిజిటల్ భూ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం ప్రాజెక్టు ఉద్దేశమని.. రైతులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు సర్వే అఽధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రైతుల సందేహాలు, అభ్యంతరాలను నివృత్తి చేసి నిబందనల ప్రకారం సర్వే చేపట్టాలని సూచించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, సర్పంచ్ రవీందర్, రెవెన్యూ అఽధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
జ్వరంతో వచ్చే రోగికి డెంగీ పరీక్షలు..
జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి కచ్చితంగా డెంగీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. డెంగీ పరీక్షలు చేయడంతో సకాలంలో గుర్తించి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. క్షయ అనుమానితులను గుర్తించి అవసరమైన వారికి ఎక్స్రే తీసేందుకు ప్రభుత్వం ఇచ్చిన యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో శుభ్రత పాటించాలని సూచించారు.
● మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరిందని.. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శుక్రవారం ఆయన హాస్టల్ గదులను పరిశీలించగా.. పైకప్పు పెచ్చులూడి కనిపించడంతో స్పందించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్నాయక్, ఎస్సీ సంక్షేమశాఖ అఽధికారి రాంజీరావు, వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల అఽధికారులు ఉన్నారు.


