● అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ.3.75 కోట్ల విలువైన బ్యాంకులింకేజీ రుణాల చెక్కును అందజేశారు. అలాగే కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు.
● టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా ఏఐ సాంకేతికతతో 1,86,705 అనుమానిత కేసులను గుర్తించగా.. వారిలో 319 మందికి సీఎస్ఆర్ నిధి నుంచి పోషణ కిట్లు, ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు నిండిన 2,616 మంది బాలికలకు హెచ్పీవీ వాక్సినేషన్ చేసినందుకు జిల్లా రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచిందన్నారు. 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ జిల్లా జనరల్ ఆస్పత్రికి మంజూరై ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
● శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా 1,785 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. లోక్అదాలత్ ద్వారా జిల్లాలో 3,566కు పైగా కేసులు పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించినట్లు చెప్పారు. జిల్లాకేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న భరోసా కేంద్రాన్ని ఎస్పీ చొరవతో ఉమెన్ సేఫ్టీవింగ్, కలెక్టర్ నిధులతో పోలీసు పాత నివాస భవనానికి మరమ్మతు చేయించి తరలించి సేవలందిస్తున్నారన్నారు.
జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు కాగా.. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాలు, పాఠశాల బ్లాకుల నిర్మాణానికి రూ.13.50 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 71 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తున్నట్లు చెప్పారు.


