వనపర్తి: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి, వారు ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందించడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. గ్రామీణ భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థ (వీఐపీ) వ్యవస్థాపకులు నాగేంద్రస్వామి ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన బాలికలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి మండలం నుంచి పదో తరగతి తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థినులను సత్కరించి, ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


