న్యూస్రీల్
మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
వంటింట్లో మంటలు.. పాలకులకు పట్టదా?
ధరలు నియంత్రించాలంటూ కలెక్టరేట్ ఎదుట అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు కదం తొక్కారు. జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కె.పుణ్యవతి, పాలూరి రమణమ్మ మాట్లాడుతూ, జూలై, ఆగస్టు నెలల్లోనే సరుకుల ధరలు 40 నుంచి75 శాతం మేర పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధర 100 శాతం పెరగగా, పంచదార కిలో రూ.70 దాటిందన్నారు. ప్రతి కుటుంబంపై నెలకు రూ.4 వేల నుంచి రూ.7వేల అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై నిత్యావసరాలు ఇవ్వాలని, రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ వద్దు.. పంచాయతీయే ముద్దు..
రాజాం మండలంలోని పూర్వపు కొత్తవలస గ్రామ పంచాయతీని (కొత్తవలస, గోపాలపురం) రాజాం మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు, కూలీలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నాచేశారు. నూటికి నూరు శాతం వ్యవసాయాధారిత గ్రామమైన కొత్తవలసను మున్సిపాలిటీలో కలిపితే పన్నుల భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామానికి ఉపాధిహామీ, పంచాయతీ నిధులు ఆగిపోయాయని, విలీనం చేస్తే పేద కూలీలు ఉపాధి కోల్పోతారని స్పష్టం చేస్తూ వినతిపత్రం అందజేశారు.


