భామిని: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని పెద్దదిమిలికి చెందిన నిద్దాన గోవిందరావు(35) శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు బత్తిలి పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ నెల 8వ తేదీన మద్యం మత్తులో పురుగుమందు తాగిన నిద్దాన గోవిందరావు(35) అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మద్యానికి బానిసైన గోవిందరావుతో భార్య నాగమణి గొడవ పడి ఇద్దరు కూతుళ్లను తీసుకుని రాజమండ్రిలోని కన్నవారి ఇంటికి వవెళ్లిపోయింది. భర్త మృతి వార్త తెలుసుకుని వచ్చిన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బాడంగి: మండలంలోని పినపెంకి గ్రామానికి చెందిన ఈదుబిల్లి సింహాచలం(56)పురుగు మందు తాగి బొబ్బిలి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలం పక్షవాతంతో బాధపడుతుండేది. మందులు వేసుకోనిదే నిద్రపట్టేదికాదని చనిపోతే బాగుండునని తరచూ బెదిరిస్తూ ఉండేది. ఆమె భర్త అప్పలనాయుడు పొలంపనికి వెళ్లిపోవడంచూసి ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఇంటి ముందుపడిపోయింది. భర్తఇంటికి వచ్చేసరికి భార్య పడిపోయి నురగలు కక్కడంతో వెంటనే బొబ్బిలి ఆస్పత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సచేసి పురుగుమందు కక్కిస్తూ తమ పర్యవేక్షణలో ఉంచగా ఉదయం 11గంటల ప్రాంతంలో మృతిచెందింది. ఆమె కుమారుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువువులకు అప్పగించారు.
పార్వతీపురం రూరల్: తీవ్రమైన తలనొప్పి బాధను తాళలేకపోయిన ఓ వివాహిత ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన పొదిలాపు స్రవంతికి సుమారు 20 ఏళ్ల క్రితం గరుగుబిల్లి మండలం వల్లరిగుడబ గ్రామానికి చెందిన చెన్నంనాయుడుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా గత 15 ఏళ్లుగా ఆమె పుట్టింట్లోనే తల్లి అనసూయ వద్ద ఉంటోంది. కొంతకాలంగా స్రవంతిని తీవ్రమైన పార్శ్వపు తలనొప్పి వేధిస్తుండడంతో మందులు వాడుతోంది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 3:30 గంటల ప్రాంతంలో తలనొప్పి తీవ్రరూపం దాల్చడంతో, ఆ వేదన భరించలేక ఇంట్లోని ఫినాయిల్ తాగేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కారులో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


