తెల్ల బంగారంగా పేరొందిన పత్తి సాగు జిల్లాలో క్రమేణా తగ్గుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఓ వైపు ఇబ్బంది పెడుతుంటే.. దిగుబడి వచ్చాక తగిన గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడం కూడా రైతులను సాగు నుంచి దృష్టి మళ్లించేలా చేస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా తగిన ప్రోత్సాహం కూడా లేకపోవడం మరింత ఇబ్బందులు పెడుతుంది. ఫలితంగా గడిచిన రెండేళ్లుగా పత్తి సాగు తగ్గుముఖం పడుతోంది.
● గతేడాది కంటే తగ్గిన సాగు
● కిట్టని గిట్టుబాటు ధర
● దళారుల బారిన పడి ధర కుదేలు
రాజాం: పత్తి పంట సాగు తగ్గుతోంది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తికి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. అక్కడ కాటన్ మిల్లులు అధికంగా ఉండడంతో పాటు సకాలంలో కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు నామమాత్రం కాగా, దళారీలు అధిక లాభాలు ఆశించి, సిండికేట్గా మారుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పత్తి పంట దిగుబడి గత ఏడాది భారీగా పడిపోయింది. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్లు రావల్సి ఉండగా, కేవలం 3 నుంచి 4 క్వింటాళ్లు మధ్య మాత్రమే వచ్చింది. క్వింటా పత్తి ధర రూ.8110లుగా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత పేరుతో రైతులను ముప్పతిప్పలు పెట్టారు. జిల్లాలో 50 క్వింటాళ్లు మేర పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాల వద్ద 25 వేల క్వింటాళ్లు కొనుగోలు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది ఆ ప్రభావం సాగుపై పడింది. గతంలో కంటే సాగు తగ్గుముఖం పట్టింది.
ఇబ్బందులు ఉన్నాయి..
గతంలో మా పొలాల్లో పత్తి పంట వేసేవాళ్లం. మంచి ఆదాయం ఉండేది. ఇప్పుడు తగ్గించేశాం. పత్తిని సకాలంలో కొనుగోలు చేయడం లేదు. రాజాం మార్కెట్ యార్డుకు తరలిస్తే అక్కడి నుంచి రామభద్రపురం వెళ్లమంటున్నారు. అక్కడ ఏవేవో సాకులు చెప్పి దళారీలను బెత్తాయిస్తున్నారు. ఈ ఏడాది పత్తిపంట సాగును తగ్గించడమే కాకుండా, మిగిలిన భూమిని ఖాళీగా ఉంచేశాం.
– ఎస్.వెంకటనాయుడు, రైతు,
పొనుగుటివలస, రాజాం మండలం


