● కమ్యూనిస్టు వాది చింతల తిరుపతి రావు అభిమానం
● పెద్దకుమారుడు హోచ్మన్ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు
రామభద్రపురం: మండలకేంద్రానికి చెందిన కమ్యూనిస్టు వాది చింతల తిరుపతిరావు తన పిల్ల లందరికీ వివిధ దేశాల నాయకుల పేర్లు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు ఐదుగురు పిల్లలు కాగా వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమారుడికి హోచ్మన్, రెండవ కుమారుడికి లెనిన్, మూడవ కుమారుడికి భగత్ సింగ్, మొదటి కుమార్తెకు ఇందిరాగాంధీ, రెండవ కుమార్తెకు ఝాన్సీలక్ష్మి అని పెర్లు పెట్టారు. దేశ నాయకుల పేర్లు ఎందుకు పెట్టారో ఆయన మాటల్లో..
హోచ్మన్: దండయాత్ర చేసి దోచుకుందాం అన్న దురుద్దేశంతో అమెరికా దాడి చేసి వియత్నం దేశాన్ని రెండుముక్కలుగా ఉత్తరవియత్నం, దక్షిణ వియత్నంగా విడగొట్టింది. దక్షిణ వియత్నాం ఆ యుద్ధంలో అమెరికాకు మద్దతు పలికింది. ఉత్తర వియత్నాం నాయకుడు హోచ్మన్ అగ్ర రాజ్యమైన అమెరికాపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని సంపాదించి కమ్యూనిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజాస్వామ్య యుతంగా ఉన్న భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని అమెరికా నుంచి రాజ్యాన్ని సంపాందించి మంచి పేరు తెచ్చుకోవడంతో పెద్దకుమారుడికి పేరు హోచ్మన్ అని పెట్టాను.
లెనిన్: రష్యాదేశంలో నిరంకుశంగా పరిపాలన చేస్తున్న ఆ దేశ రాజులపై లెనిన్ ప్రజా తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి మంచి పేరుతెచ్చుకోవడంతో రెండవ కుమారుడికి లెనిన్ అని పేరు పెట్టాను.
భగత్సింగ్: బ్రిటిష్ వారికి తలొగ్గకుండా భారత స్వాతంత్య్రం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలొడ్డిన వ్యక్తి భగత్ సింగ్. భారతదేశ విముక్తి కోసమే తన ప్రాణాలను అర్పించాడు కాబట్టి మూడవ కుమారుడికి భగత్సింగ్ అని నామకరణం చేశాను.
ఇందిరాగాంధీ: అలీన దేశాధ్యక్షురాలిగా,దేశ ప్రధాన మంత్రిగా ఉండి మంచి పరిపాలన అందించి ప్రపంచస్థాయిలో మంచి పేరు సంపాదించినందుకు గాను మొదటి కుమార్తెకు ఇందిరాగాంధీ అనిపేరు పెట్టాం.
ఝాన్సీలక్ష్మి: సామ్రాజ్య వాదులైన బ్రిటిష్ వారితో పోరాడి వీరవనితగా ప్రాణాలు వదిలింది కాబట్టి రెండవ కుమార్తెకు ఝాన్సీలక్ష్మి అని పేరు పెట్టాం.
గాంధీ విగ్రహం ఏర్పాటు..
పెద్దకుమారుడు హోచ్మన్ తన తండ్రికి ఉండే ఆదర్శభావాలను నిరూపించుకుంటూ మండలకేంద్రంలోని బైపాస్రోడ్డు కూడలిలో తన సొంత నిధులతో 1999లో గాంధీ విగ్రహం స్థాపించారు. ఈ ప్రాంతంలో ఇదే మొదటి విగ్రహం కావడం విశేషం.


