పార్వతీపురం రూరల్: ఆన్లైన్ బెట్టింగ్లు, జల్సాలకు బానిసై రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.71.40 లక్షల విలువైన 42 తులాల బంగారు ఆభరణాలను నూటికి నూరు శాతం రికవరీ చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి వెల్లడించారు. స్థానిక మెట్టువీధికి చెందిన సువ్వాడ సతీష్ ఓ టిఫిన్ సెంటర్లో పని చేస్తుంటాడు. సంపాదన చాలక, జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగా ఈ నెల 2, 3 తేదీల్లో సీతానగరానికే చెందిన కుర్మదాసు కిశోర్, వక్కలగడ్డ సురేష్ల ఇళ్ల తాళాలను ఇనుప రాడ్డుతో పగులగొట్టి మొత్తం 42 తులాల బంగారం అపహరించాడు. ఈ వరుస చోరీలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాధితుల ఫిర్యా దుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దొంగ కదలికలను పసిగట్టారు. శనివారం ఉదయం స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సతీష్ ఇంట్లో దాచిన మంగళసూత్రాలు, గాజులు, నెక్లెస్లు తదితర 42 తులాల స్వర్ణాభరణాలను సీజ్ చేసి, అతడిని కోర్టు రిమాండ్కు తరలించారు.
రూ. 71.40 లక్షల విలువైన
42 తులాల బంగారం స్వాధీనం
ఆన్లైన్ బెట్టింగ్ల కోసమే
దొంగతనాల బాట


