పార్వతీపురం: పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్కు సహజమైన పౌష్టికాహారమే శ్రీరామ రక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఐసీడీఎస్ సమీక్షా సమవేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బిడ్డపుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వడం, రెండేళ్లవరకు తల్లిపాలు అందించడం అత్యవసరమని సూచించారు. రెండేళ్లలోపు పిల్లలకు చక్కెర, అధిక ఉప్పు, మసాలాలు, కూల్డ్రింక్స్, ప్రోపెస్ చేసిన జ్యూస్లకు దూరంగా ఉంచి పండ్లు, కూరగాయలు, సహజ ఆహారాన్ని అలవాటు చేయాలని తెలిపారు. పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించకుండా స్వయంగా తినే అలవాటు పెంపొందించాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబ ఆదాయం రెట్టింపు
లక్ష్యంగా కార్యాచరణ
జిల్లాలోని ప్రతి కుటుంబం కనీసం రూ. 5లక్షల వార్షిక ఆదాయం సాదించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక కొత్త ఆదాయ వనరుల యూనిట్ను ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాల రుణాలను ఉత్పాదక రంగాలకే వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత విద్య, వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని కుటుంబ వ్యయాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నపాటి అనారోగ్యాలకు ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్.ప్రభావతి, సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.


