గిరిజన బాలికలకు నృత్య‘శిక్ష’ణ! | - | Sakshi
Sakshi News home page

గిరిజన బాలికలకు నృత్య‘శిక్ష’ణ!

Jul 31 2026 2:09 AM | Updated on Jul 31 2026 2:09 AM

విజయనగరం అర్బన్‌/పూసపాటిరేగ:

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ ముందు ‘మెప్పు’ కోసం చంద్రబాబు సర్కారు పాకులాడుతోంది. థింసా నృత్య శిక్షణ పేరిట గిరిజన బాలికలను అవస్థలకు గురిచేస్తోంది. ‘గిన్నిస్‌ రికార్డు’ ఆర్భాటం కోసం వేలాది మంది గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులను చదువులకు దూరం చేయడం, మండే ఎండలో శిక్షణ ఇస్తుండడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రికార్డు సంఖ్యలో 14వేల మంది గిరిజన బాలికలతో థింసా నృత్యం చేయించాలని సర్కారు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఐటీడీఏ పాడేరు పరిధి నుంచి 7 వేల మంది, పార్వతీపురం మన్యం నుంచి 3 వేలు, రంపచోడవరం నుంచి 2 వేలు, సీతంపేట నుంచి 2 వేల మంది 8, 9, 10 తరగతులు చదువుతున్న బాలికలను ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 26వ తేదీ నుంచి ఎయిర్‌పోర్టు గ్రౌండ్‌లో థింసా నృత్యంపై శిక్షణ ఇస్తోంది. శిక్షణ, ప్రచారం మోజుపై ఉన్న ఆసక్తి గిరిజన బాలికలకు సదుపాయాలు కల్పించడంలో చూపడం లేదు. సరైన తిండిలేక, పడుకునేందుకు చోటులేక నరకయాతన పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల్లో సరైన వసతులు లేకుండా పశువులకంటే హీనంగా వసతిగృహాలు, కళాశాలల్లో ఉంచడంపై బాలికల తలిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో గోదావరి పుష్కరాలు, యోగాసన సాధన, ఆలయాల వద్ద జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ.. ప్రచారం పేరుతో ప్రాణాలు తీయడం చంద్రబాబుకు అలవాటని, గిరిజన బాలికలు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ గిరిజన సంఘాల నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఆకలి కేకలు..

రికార్డులు తిరగరాయాలన్న ఆకాంక్షే తప్ప, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాలికల కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి నృత్య సాధన పేరిట గంటల తరబడి ఎండలోనే శిక్షణ ఇస్తున్నారు. వీరికి విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ ప్రాంతాల్లోని వసతి కేంద్రాల్లో, విశాఖ సరిహద్దుల్లోని తగరపువలస, భీమిలి మండలాల వసతి కేంద్రాల్లో బాలికలకు ఆశ్రయం కల్పించారు. 150 మందికి మాత్రమే వసతి ఉన్న ఆయా కేంద్రాల్లో మరో 200 మంది వరకు అదనంగా చేర్చడంతో సౌకర్యాలు మృగ్యమయ్యాయి. పిల్లలకు వండిన అన్నం సరిపోక, అర్ధాకలితోనే నిద్రపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఫ్యాన్లు పనిచేయక, ఉక్కబోత, విషపురుగుల బెంగతో బాలికలు నిద్రకుదూరమవుతున్నారు. 14 వేల మంది బాలికలకు తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో దుర్వాసన మధ్యే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని గిరిజన విద్యార్థిని, ఉపాధ్యాయురాలు తెలిపారు.

ప్రచార ఆర్భాటం.. గిరిజన బాలికల ప్రాణాలతో చెలగాటం!

థింసా శిక్షణ పేరిట నరకయాతన

14 వేల మంది బాలికలను తరలించి చేతులెత్తేసిన సర్కారు

డెంకాడ, భోగాపురం మండలాల్లో

అస్తవ్యస్తంగా వసతులు..

కన్నీరు పెడుతున్న విద్యార్థినులు, టీచర్లు

బయటకు చెప్పుకోలేక

మదనపడుతున్న వైనం

బలి పశువులుగా టీచర్లు..

ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి విద్యార్థినులతో పాటు వారిని పర్యవేక్షించేందుకు వచ్చిన గిరిజన సంక్షేమ పాఠశాలల టీచర్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 13 వేల మంది బాలికల్లో 50 మందికి ఒకరు వంతున దాదాపు 260 మంది టీచర్లను గైడ్‌లుగా నియమించారు. ‘పిల్లల బాధ్యత మాపై తోసేశారు.. కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు, రాత్రి పడుకోవడానికి సరిపడా స్థలం కూడా లేదు.. పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఏదైనా విపత్తు జరిగితే అధికారులు తప్పించుకుంటారు.. మా సరిస్థితి ఏమిటి?’ అంటూ పలువురు టీచర్లు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1న ప్రధాని పర్యటన మార్గంలో అట్టహాసంగా థింసా నృత్యం చేయించి క్రెడిట్‌ కొట్టేయాలని చూస్తున్న సర్కారు.. తక్షణమే బాలికలకు నాణ్యమైన భోజనం, రక్షణ, సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే బాధ్యులైన అధికారులను నిలదీస్తామని గిరిజన, విద్యార్ధి సంఘాలు మరోవైపు హెచ్చరిస్తున్నాయి.

సాక్షి, విజయనగరం సెల్‌ : 99516 02981

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement