విజయనగరం టౌన్:
మేళతాళాలు.. భక్తుల జయజయధ్వానాలు... మహిళల కోలాట ప్రదర్శనలు, భక్తుల భజనల నడుమ జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. దారిపొడవునా భక్తులు స్వామివారికి జేజేలు పలికారు. జై జగన్నాథ్ అంటూ రథాన్ని కదిలించారు. స్థానిక సంతపేట జగన్నాథ స్వామి ఆలయం, దాసన్నపేట ఆలయం, మూడుకోవెళ్లు, కొత్తపేట అనాసరపు వారి వీధి వద్ద స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు దాసన్నపేటలో స్వామివారిని దర్శించి, పూజలు నిర్వహించారు. సంతపేట జగన్నాథస్వామి ఆలయం వద్ద పైడితల్లి ఆలయ ఈఓ కె.శిరీష నేతృత్వంలో స్వామివారిని 9.30 గంటలకు రథారోహణం చేశారు. రాత్రి 10 గంటల వరకూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తోమాల మందిరం వద్దకు స్వామివారిని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తోమాలమందిరానికి తీసుకువెళ్తామన్నారు. అక్కడ శీలవిరుపు ఉత్సవం చేస్తామని చెప్పారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీన జరిగే మారురథయాత్ర వరకు స్వామివారు అక్కడే భక్తులకు దర్శనమిస్తారన్నారు. దాసన్నపేటలో స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం రాత్రి గుడిశెనగుళ్లకు చేరుస్తామన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు.


