సంతకవిటి: రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి ప్రధాన కాలువకు సాగునీటిని ఆనకట్ట వైస్ చైర్మన్ ఎం.కృష్ణమూర్తి బుధవారం విడుదల చేశారు. దాదాపు 50 కిలోమీటర్ల పొడవున్న కుడిప్రధాన కాలువ నుంచి సంతకవిటి, పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలాల పరిధిలో 18 వేల ఎకరాల పైబడి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కార్యక్రమంలో ఆనకట్ట డీఈ వై.రవీంద్రనాయుడు, కుడి ప్రధాన కాలువ ఏఈ రాంబాబు, తదితరుల పాల్గొన్నారు.
వరుణుడి కరుణ కోసం పూజలు
వంగర: మండలంలోని బాగెంపేట గ్రామంలో రైతులు, మహిళలు వరుణుడి కరుణ కోసం బుధవారం పూజలు చేశారు. గ్రామ సమీపంలో ఉన్న రావిచెట్టుకు 101 బిందెల నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం వర్షాలు కురవాలని పూజలు చేశారు. అలాగే గ్రామంలోని పలువురు ఆధ్యాత్మిక వక్తలు మహాభారతంలోని విరాటపర్వం పురాణగాథను రైతులకు వినిపించారు. వర్షాలు కురవాలని, పంటలు పుష్కలంగా పండాలని వారంతా వరుణు దేవుడికి ప్రార్థనలు చేశారు.
జాతీయస్థాయి టెన్ని కాయిట్ పోటీలకు పెదనడిపల్లి బాలిక
చీపురుపల్లి: మండలంలోని పెదనడిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఎం.దివ్యచరిత జాతీయ స్థాయి టెన్ని కాయిట్ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 38వ టెన్నికాయిట్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబర్చింది. పంజాబ్లోని జలంధర్ డీఏవీ యూనివర్సిటీలో అక్టోబర్ 17 నుంచి 21 వరకు జరగనున్న జాతీయ పోటీల్లో తలపడనుంది. విద్యార్థినినిఆ పాఠశాల హెచ్ఎం ఎల్.తిరుపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.రామారావు అభినందించారు.
మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చేయాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి
విజయనగరం అర్బన్: మ్యుటేషన్ కోసం వచ్చే దరఖాస్తులను రెవెన్యూ అధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జేసీ ఎస్.సేతుమాధవన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ నుంచి బుధవారం మాట్లాడారు. 22ఏ దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులను సమీక్షించారు. రీ–సర్వే, జాయింట్ ఎల్పీఎమ్స్, ఆర్ఓఆర్ మ్యుటేషన్ల పురోగతిని పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ సీహెచ్.సత్తిబాబు, వివిధ ప్రాంతాల ఆర్డీఓలు, ఎస్డీసీలు, సెక్షన్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐఓలు పాల్గొన్నారు.


