విజయనగరం: విద్యారంగ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు అలసత్వంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. యువగళం పేరుతో విద్యార్థులను మోసంచేసిన విద్యాశాఖమంత్రి లోకేశ్ ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. రెండేళ్లుగా ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం, వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించకపోవడం, డిగ్రీ, పీజీ కళాశాలల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో జాప్యానికి నిరసగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా చేశారు. తమ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. ఫణీంద్రకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుమన్ మాట్లాడుతూ విద్యారంగం సమస్యల నిలయంగా మాచ్చేసిన ఘనత కూటమి సర్కారుకే దక్కిందన్నారు. పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థుల సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. జీఓ 77 వల్ల విద్యార్థులు పీజీ చదువుకు దూరమవుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో జీఓ 77ను రద్దుచేస్తామని చెప్పిన మంత్రి లోకేశ్ మోసం చేశారన్నారు. విజయనగరం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, ఐటీఐ, పాలిటెక్నికల్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.రవికుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చరణ్, గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి పి.గౌరీశంకర్, వికాస్, సాయి, శంకర్, సంతోష్, సాయిగణేష్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై గళమెత్తిన విద్యార్థిలోకం
ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల
విడుదల చేయాలని డిమాండ్
వసతిగృహాల్లో
సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు
డీఆర్వోకు వినతిపత్రం
అందజేసిన విద్యార్థిసంఘ నాయకులు


