మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకే..
ఎస్పీ ఏఆర్ దామోదర్
రామభద్రపురం: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రధాన లక్ష్యమని అందుకు తగ్గ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. స్థానిక పోలీస్స్టేషన్ను ఆదివారం ఆయన సందర్శించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బొబ్బిలి రూరల్, టౌన్ సీఐలు శ్రీనివాసరావు, నారాయణరావులకు పలు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్లతో పాటు కిలోమీటర్ దూరంలో స్టాపర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో జిల్లాలోని మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన సుమారు 200 మందిని జైలుకు పంపించామన్నారు. అతివేగం ప్రాణాలు తీస్తోందన్నారు. రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 200 మంది వరకు పోలీస్ సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం పోలీస్ శిక్షణలు జరుగుతున్నందున కొద్ది రోజుల్లో స్టేషన్కు పది మంది చొప్పున్న సిబ్బంది నియామకం జరుగుతుందన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్లు రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. రామభద్రపురం అంతర్రాష్ట్ర కూడలి కావడంతో గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట ఎస్ఐ జ్ఞానప్రసాద్, ఏఎస్ఐ అప్పారావు ఉన్నారు.


