వాషింగ్టన్: ప్రపంచాన్ని ప్రస్తుతం భారీ ఆర్థిక భూకంపం కుదిపేస్తోంది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు.. దాని సెగ ఇప్పుడు సామాన్యుని జేబుకు కూడా గట్టిగానే తగులుతోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోతున్న నేపధ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, ప్రతి వస్తువుపై ధరల మంట తప్పదని స్పష్టం చేసింది.
ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ‘సీబీఎస్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే పరిస్థితుల తీవ్రతను తెలియజేశారు. గత ఐదు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా కావాల్సిన 13 శాతం చమురు, 20 శాతం గ్యాస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ఇది ఒక చిన్న కుదుపు కాదని, ఒక పెద్ద షాక్ అని ఆమె అభివర్ణించారు. దీని ప్రభావం వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అత్యంత దారుణంగా నష్టపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధరల పెరుగుదల భారాన్ని తమ ఆదాయంపై పడుతున్న అదనపు పన్నులా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంక్షోభం కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. రవాణా, ఎరువుల సరఫరా, వ్యవసాయ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎరువుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఆసియాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్లో వెంటనే కాల్పుల విరమణ జరిగినా, తక్షణ ఉపశమనం మాత్రం ఉండదని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. ధ్వంసమైన గ్యాస్, ఇంధన మౌలిక సదుపాయాలు పూర్తిగా కోలుకునేందుకు మరో మూడు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేసింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా పడిపోయే అవకాశం ఉందని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు పేదలకు అండగా నిలవాలని ఐఎంఎఫ్ సూచించింది.
ఇది కూడా చదవండి: ‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్?


