ఆనందపురం/డెంకాడ: సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొ నాలని ఉదయాన్నే సంతోషంగా బయలుదేరారు. పెళ్లి సందడి చూసి, ఆనందంగా తిరిగి రావాలని అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ ప్రయాణం విషాదంగా మారింది. కారు లారీని ఢీకొనడంతో సంతోషంగా సాగాల్సిన ప్రయాణం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన కోన రవికిశోర్ (37) సీఆర్పీఎఫ్ జవాన్. బంధువులతో కలిసి సింహాచలంలో జరిగే స్నేహితుడు శంకర్ వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్తుండగా గంభీరం పంచాయతీ పరిధిలోని దుక్కవానిపాలెం టోల్గేట్ సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్పైకి ఎక్కిన కారు, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న రవికిశోర్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. క్షణం ముందు వరకు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకకు బయలుదేరిన ఆయన.. అదే ప్రయాణంలో విగతజీవిగా మారడం అందరినీ కలచివేసింది. కారులో ఉన్న రౌతు వరాలమ్మ, కోన వరాలమ్మ, రౌతు దుర్గ, కురుముంజి వరలక్ష్మి, బంటుపల్లి లక్ష్మి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవికిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పెళ్లి ఇంటికి చేరాల్సిన వేళ విషాద వార్త చేరడంతో ఇరు కుటుంబాల్లో కన్నీటి పర్యంతమైంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి కళ్లెదుటే...
జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న కోన కిశోర్ బుధవారం సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లికోసం స్వగ్రామమైన బొడ్డవలసకు మంగళవారం వచ్చాడు. బొడ్డవలసకు చెందిన శంకర్ పెళ్లికోసం పేరంటాళ్లను తీసుకుని బుధవారం కారులో బయలుదేరి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కారులో తల్లి కోన వరహాలు కూడా ఉంది. తల్లి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు విడవడంతో కన్నీటిపర్యంతమైంది. వరహాలకు కూడా స్పల్పగాయాలయ్యాయి.
భార్య, ఇద్దరు ఆడ పిల్లలు
మృతుడికి భార్య భాగ్యశ్రీ, కుమార్తెలు రిషితశ్రీ (3వ తరగతి), గాత్వికశ్రీ (ఎల్కేజీ)లు ఉన్నారు. తల్లిదండ్రులు కోన చిదంబరం, వరహాలకు ఇద్దరు కుమార్తెలు, రవికిశోర్ ఒక్కడే కుమారుడు. కుటుంబానికి మృతుడి జీతమే ఆధారం. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. రవికిశోర్ మృతదేహానికి పోలీస్ లాంచనాలతో బొడ్డవలసలో అంత్యక్రియలు నిర్వహించారు.


