ఆనందపురం/పెందుర్తి: మండలంలోని పలు గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. బోని గ్రామంలో జరిగిన గ్రామసభలో దశాబ్దాలుగా పరిష్కారం కాని మాన్సాస్ భూముల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అడంగల్, ఫారం–3 ప్రతులు రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడంతో బ్యాంకులు వ్యవసాయ రుణాలు నిలిపివేశాయని తెలిపారు. కొత్త విద్యుత్ మోటారు కనెక్షన్లు పొందలేకపోతున్న సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బోని అప్పలనాయుడు, బోని సన్యాసినాయుడు పాల్గొన్నారు.
వెల్లంకిలో తూతూమంత్రంగా..: వెల్లంకిలో ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా సాగిందని స్థానికులు విమర్శించారు. గ్రామస్తులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భీమన్నదొరపాలెంలో వ్యతిరేకత: జీవీఎంసీలో భీమన్నదొరపాలెం విలీనాన్ని గ్రామస్తులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. షెడ్యూల్ ప్రకారం ఆనందపురం, వేములవలస గ్రామపంచాయతీల్లో మంగళవారం జరగాల్సిన గ్రామసభలు గురువారానికి వాయిదా పడ్డాయి.
ప్రజలు లేకుండానే సభలు: పెందుర్తి మండలంలోని గుర్రంపాలెం, వాలిమెరక, జుత్తాడ పంచాయతీల్లో మంగళవారం నిర్వహించిన గ్రామసభలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో ఆయా గ్రామసభలు మొక్కుబడిగా ముగిశాయి.


