విశాఖ లీగల్: ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని విశాఖ జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయస్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ న్యాయవాదులు తనకు సుపరిచితులేనని, గతంలో కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, విశాఖ న్యాయవాదులు ఎస్.కృష్ణమోహన్, బీవీఆర్ మూర్తి, కె.రామజోగేశ్వరరావు, నాగశ్రీతో పాటు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఘన చరిత్ర కలిగిన విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సిరిపురపు కృష్ణమోహన్ పేర్కొన్నారు. న్యాయవాదులంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు న్యాయమూర్తిని సత్కరించారు.


