డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే అరెస్టులా?
ఏపీలోనూ ఢిల్లీ తరహాలో
యువత ఉద్యమం తప్పదు
వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్.కృష్ణ ఆగ్రహం
మహారాణిపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ) ఆరోపించారు. బుధవారం మద్దిలపాలెంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి ప్రశ్నించే వారిని అరెస్టు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు. రాజమండ్రిలో మెడికో విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
అరెస్టులా?
ఎన్నికల హామీలను అమలు చేయాలని అడిగినా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని శాంతియుతంగా నిరసన తెలిపినా అరెస్టులా? అని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.
యువత ఉద్యమించే పరిస్థితులు వస్తాయి
ప్రభుత్వ తీరుపై యువత, నిరుద్యోగులు, ప్రజలు త్వరలో ఉద్యమించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తీరును ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం, దిశ పోలీస్స్టేషన్లు, దిశ యాప్ను రద్దు చేయాలంటూ కేబినెట్ తీర్మానం చేయడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు.


