తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యవసర వైద్య సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకటో నంబర్ ప్లాట్ఫాం, గేట్ నంబర్–2 వద్ద పినాకిల్ హాస్పటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని బుధవారం డీఆర్ఎం లలిత్ బోహ్రా సమక్షంలో పినాకిల్ హాస్పటల్స్ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ రైల్వే, పినాకిల్ హాస్పటల్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం ప్రయాణికుల కోసం ఈ వైద్య సేవా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 24 గంటల పాటు సిబ్బంది సేవలందిస్తారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య సేవలను అందించేందుకు కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఎం లలిత్ బోహ్రాతో పాటు విశాఖపట్నం డివిజన్ డివిజనల్ రైల్వే హాస్పటల్ సీఎంఎస్ డాక్టర్ శరత్బాబు, పినాకిల్ హాస్పటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి.వి.రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణనాయక్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.


