డాబాగార్డెన్స్: జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రభుత్వ వాటాను మరింత తగ్గించే నిర్ణయాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) తీవ్రంగా ఖండించింది. బుధవారం విశాఖ డివిజనల్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గంటా వరప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఎల్ఐసీలో చెల్లించిన ఈక్విటీలో 2.5 శాతం వాటాలను విక్రయించనున్నట్లు, అదనంగా 4 శాతం గ్రీన్షూ ఆప్షన్ను ప్రకటించిందని తెలిపారు. దీంతో మొత్తం విక్రయం 6.5 శాతానికి చేరుతుందని చెప్పారు. 2022లో జరిగిన ఐపీవో ద్వారా ఇప్పటికే 3.5 శాతం వాటాలను విక్రయించారని గుర్తు చేశారు. ఎల్ఐసీ కేవలం లాభాపేక్ష సంస్థ కాదని, కోట్లాది మంది పాలసీదారుల విశ్వాసంతో నిలిచిన జాతీయ సంస్థ అని గుర్తు చేశారు. ప్రతిపాదిత ఓఎఫ్ఎస్ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.


